మరో రెండు రెవెన్యూ డివిజన్లు

February 12, 2020

రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, రాజన్న సిరిసిల్ల‌ జిల్లాలో వేముల‌వాడ రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు గానూ ప్రభుత్వం ఫిబ్రవరి 3న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ప్రజల‌ నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు నెల‌ రోజుల‌ గడువు ఇచ్చింది. కొత్తగా ప్రతిపాదించిన జోగిపేట రెవెన్యూ డివిజన్‌లో ఆందోల్‌, పుల్క‌ల్‌, చౌటకూర్‌(కొత్త మండలం), వట్‌పల్లి మండలాలు ఉండనున్నాయి. వేముల‌వాడ రెవెన్యూ డివిజన్‌లో వేముల‌వాడ, వేముల‌వాడ రూరల్‌, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలు ఉండనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా చౌటకూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త మండలంలో పుల్క‌ల్ మండలంలోని పోసానిపల్లి, చౌటకూర్‌, శేరిరామిరెడ్డిగూడ, సుల్తాన్‌పూర్‌, సరాఫ్‌పల్లి, కొర్పోల్‌, లింగంపల్లి, అంగడిపేట్‌, తాడ్‌దాన్‌పల్లి, గంగోజీపేట్‌, చక్రీయాల్‌, శివ్వంపేట, వెండికోల్‌, హున్నాపూర్‌ గ్రామాలు ఉండనున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న చౌటకూర్‌ మండలం కొత్తగా ప్రతిపాదించిన జోగిపేట రెవెన్యూ డివిజన్‌లో ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.